ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్…అవుతారా..?
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రాతిపదికనే భర్తీ.. :
ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మొదట ఏడాది కాలానికి గాను కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటారు. అనంతరం మంచి పనితీరు, ఖాళీలకు అనుగుణంగా మరో రెండేళ్ల వరకు ఈ ఒప్పందాన్ని పొడిగిస్తారు. మూడేళ్ల కాంట్రాక్టును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారు.. ఐడీబీఐ అంతర్గతంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–1) పోస్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
వేతనాలు ఇలా..:
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఫిక్స్డ్ సాలరీస్ను అందిస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.29000 చెల్లిస్తారు. రెండో ఏడాది కాంట్రాక్టు పొడిగించినట్లయితే.. ప్రతి నెల రూ.31,000.. అలాగే మూడో ఏడాది కూడా సేవలను వినియోగించుకుంటే ప్రతి నెల రూ.34,000 వేలు వేతనంగా చెల్లిస్తారు.
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఏ రకమైన అలవెన్సులు లభించవు. అలాగే ఎటువంటి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు కూడా ఉండవు.
అర్హతలు :
- ఐడీబీఏ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
వయసు :
01–07–2021నాటికి 20–25ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు–5ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్–5ఏళ్లు, ఓబీసీ–3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ఇలా..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టుకు పిలుస్తారు. రాత పరీక్షతోపాటు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు..
ఆన్లైన్ పరీక్ష (సీబీటీ) :
ఆన్లైన్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్æ 50 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు (0.25) మార్కు తగ్గిస్తారు.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు18, 2021
ఆన్లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 5, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.idbibank.in